Rs500 Note
Rs500 NoteRBI Alert : ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకుపోతుందో, అంతకంటే రెట్టింపు వేగంతో కేటుగాళ్లు కొత్త కొత్త మోసాలకు తెరతీస్తున్నారు.
ముఖ్యంగా మార్కెట్లో నకిలీ నోట్ల చలామణి ఎప్పుడూ పెద్ద సమస్యగానే మారుతోంది. పోలీసులు, బ్యాంకులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, సామాన్య ప్రజల జేబుల్లోకి ఎక్కడో ఒకచోట ఈ దొంగ నోట్లు చేరిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులను అలర్ట్ చేసింది. రూ.500 నోటు విషయంలో మోసపోకుండా ఉండేందుకు, అసలైన నోటును ఎలా గుర్తించాలో వివరిస్తూ ఆర్బీఐ ఒక కీలక సమాచారాన్ని పంచుకుంది.
ఎక్స్ వేదికగా ఆర్బీఐ పోస్ట్
ఆర్బీఐ ఎల్లప్పుడూ తన కస్టమర్ల ప్రయోజనాలను కాపాడుతూ, వారిని ఆర్థిక నష్టాల నుంచి రక్షించడానికి సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తూనే ఉంటుంది. తాజాగా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ను షేర్ చేసింది. ఈ పోస్ట్లో ఒక రూ.500 నోటును ఉంచి, ఒక ప్రత్యేకమైన స్థలాన్ని భూతద్దం ద్వారా జూమ్ చేసి చూపించింది. అందులో INDIA भारत అని అత్యంత చిన్న అక్షరాలతో రాసి ఉంది. ఈ చిన్న ఫీచర్ ఆధారంగానే నకిలీ నోట్లకు, అసలు నోట్లకు ఉన్న తేడాను మనం సెకన్లలో కనిపెట్టేయవచ్చు.
ఏమిటీ మైక్రోలెటరింగ్ ఫీచర్? ఎక్కడెక్కడ ఉంటుంది?
ఈ సమాచారాన్ని పంచుకుంటూ ఆర్బీఐ క్యాప్షన్లో ఇలా రాసుకొచ్చింది.. "ఈ రోజుల్లో నకిలీ నోట్ల చలామణి కేసులు పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, నోటుపై ఉండే అత్యంత చిన్న భద్రతా గుర్తింపును తెలుసుకోవడం మిమ్మల్ని పెద్ద ఆర్థిక నష్టం నుండి కాపాడుతుంది. రూ.500 నోటులో ఉండే అటువంటి ఒక ప్రత్యేకమైన సెక్యూరిటీ ఫీచరే ఈ మైక్రోలెటరింగ్." నోటుపై చాలా చిన్న అక్షరాలను ముద్రించడాన్ని మైక్రోలెటరింగ్ అంటారు. రూ.500 నోటుపై ఈ అక్షరాలు ఎక్కడెక్కడ ఉంటాయో ఆర్బీఐ స్పష్టంగా వివరించింది.
రూ.500 నోటుపై ఉన్న గాంధీజీ బొమ్మ శాలువా మడతలను నిశితంగా గమనిస్తే.. అక్కడ చాలా చిన్న అక్షరాలతో భారత్, INDIA అని రాసి ఉంటుంది. నోటుపై ఉన్న గాంధీజీ కళ్లద్దాల ఫ్రేమ్ను జాగ్రత్తగా చూస్తే, అక్కడ RBI అని మైక్రో లెటర్స్తో ముద్రించి ఉంటుంది. ఇవే కాకుండా రూ.500 నోటుకు ఎడమ వైపున RBI500INDIA అనే మైక్రో లెటర్స్ స్పష్టంగా కనిపిస్తాయి.
అనుమానం వస్తే ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను చూడండి
మీ దగ్గరకు వచ్చే రూ.500 నోటుపై ఈ మైక్రోలెటర్స్ గనుక స్పష్టంగా కనిపించకపోతే, లేదా ముద్రణ సరిగ్గా లేనట్లు అనిపిస్తే అది నకిలీ నోటు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణ ప్రింటర్లు లేదా జిరాక్స్ మిషన్ల ద్వారా దొంగ నోట్లను తయారు చేసేటప్పుడు ఈ మైక్రోలెటరింగ్ టెక్నాలజీని కేటుగాళ్లు కాపీ కొట్టడం అసాధ్యం. ఒకవేళ మీ చేతిలో ఉన్న నోటు అసలైనదా కాదా అని గుర్తించడంలో మీకు ఇంకా ఏదైనా సందేహం ఉంటే, వెంటనే ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించి పూర్తి సెక్యూరిటీ ఫీచర్లను సరిచూసుకోవచ్చని కేంద్ర బ్యాంక్ సూచించింది. ఇకపై మార్కెట్లో ఎవరి దగ్గరైనా రూ.500 నోటు తీసుకునేటప్పుడు ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ సొమ్ము భద్రంగా ఉంటుంది.

