Renigunta: ఎముకల సమస్యలకు ఉచిత వైద్య సలహా..
రేణిగుంట: కరకంబాడిలోని అమరా ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఉచితంగా "ఆర్థోపెడిక్ డిజిటల్ సెకండ్ ఒపీనియన్ సర్వీస్"ను గురువారం ప్రారంభించారు.
ఈ సేవలు మే 20, 2026 నుంచి నవంబర్ 19, 2026 వరకు ఆరు నెలలపాటు అందుబాటులో ఉండనున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ, రోగులు తమ వైద్య నివేదికలు, స్కానింగ్లు, పరీక్షల వివరాలను క్యూ ఆర్ కోడ్ ద్వారా అప్లోడ్ చేసి నిపుణుల అభిప్రాయాన్ని సులభంగా పొందే విధంగా ఈ సేవలను రూపొందించినట్లు తెలిపారు. ముఖ్యంగా శస్త్రచికిత్స అవసరమా లేదా, ప్రస్తుతం కొనసాగుతున్న చికిత్స సరైనదేనా, ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఉన్నాయా వంటి అంశాలపై నిపుణుల సలహాలు అందిస్తామని చెప్పారు.
అనవసర వైద్య పరీక్షలు, అధిక చికిత్స ఖర్చులను తగ్గించుకోవడంలో ఈ డిజిటల్ సెకండ్ ఒపీనియన్ సేవలు రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. రోగులు తమ మొబైల్ ఫోన్ ద్వారా క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేసి వివరాలను అప్లోడ్ చేయగానే వైద్య నిపుణులు కేసును పరిశీలించి తగిన సూచనలు అందిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కుమార్ రెడ్డి, డాక్టర్ అశోక్ రెడ్డి, డాక్టర్ ముని కృష్ణయ్య, వేణుగోపాల్, పీఆర్ఓ మునినాదం, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

