Renigunta: వెన్నుపోటుకు రెండేళ్లు రేణిగుంటలో వైఎస్సార్సీపీ నిరసనల హోరు
రేణిగుంట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా "వెన్నుపోటుకు రెండేళ్లు" అనే నినాదంతో రేణిగుంటలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద భారీగా చేరుకున్న పార్టీ శ్రేణులు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగులు, పేదల సంక్షేమానికి సంబంధించిన అనేక హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ప్రకటించిన మేనిఫెస్టోను ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు.
నిరసనలో భాగంగా మేనిఫెస్టో కాగితాలు దహనం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

