రూ. 299లకే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ తోపాటు మరో 5 యాప్ ల సబ్స్క్రిప్షన్.. అదిరిపోయే ఆఫర్.. కట్ చేస్తే..!
OTT Subscription Scam: ప్రస్తుతం భారతదేశంలో ఒక కొత్త రకమైన ఆన్లైన్ మోసం వేగంగా విస్తరిస్తోంది.
ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ స్కామ్ జరుగుతోంది. కేవలం రూ. 299 చెల్లిస్తే చాలు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్, జీ5, సోనీ లివ్ వంటి అగ్రశ్రేణి ఓటీటీ ప్లాట్ఫారమ్ల సభ్యత్వం లభిస్తుందని నమ్మిస్తున్నారు. వినడానికి ఇది చాలా అద్భుతమైన ఆఫర్లా అనిపించినప్పటికీ, ఇది వినియోగదారులను దోచుకోవడానికి వేసిన ఒక పెద్ద వల అని మీకు తెలుసా?
ఈ మోసం ఎలా జరుగుతుందో తెలుసా?
సైబర్ నేరగాళ్లు నకిలీ వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఛానెల్లను సృష్టించి, అక్కడ ఇటువంటి ప్రకటనలు ఇస్తున్నారు. చాలా తక్కువ ధరకే ప్రీమియం ఖాతాలను ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు. ఎవరైనా వినియోగదారుడు ఆసక్తి చూపిస్తే, వారి మొబైల్ సంఖ్య, ఈమెయిల్, యూపీఐ వివరాలను అడుగుతారు. ఆ తర్వాత వారు పంపే క్యూఆర్ కోడ్ లేదా పేమెంట్ లింక్ చూడటానికి అసలు దానిలాగే కనిపిస్తుంది. కానీ మీరు నగదు పంపిన వెంటనే ఆ డబ్బు మాయమవ్వడమే కాకుండా, ఎటువంటి సబ్స్క్రిప్షన్ లభించదు. పైగా మీ వ్యక్తిగత సమాచారం దొంగల చేతుల్లోకి వెళుతుంది.
ప్రజలు ఎందుకు మోసపోతున్నారు?
ప్రస్తుతం అన్ని ఓటీటీ ప్లాట్ఫారమ్ల సభ్యత్వాలను విడివిడిగా తీసుకోవాలంటే భారీగా ఖర్చు అవుతోంది. ఈ బలహీనతను నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణంగా సాధ్యం కాని 'లైఫ్ టైమ్ సబ్స్క్రిప్షన్' వంటి మాటలతో ప్రజలను ఆకర్షిస్తారు. ఒక డీల్ నమ్మశక్యం కానంత తక్కువ ధరకు వస్తుందంటే, అందులో ఏదో మోసం ఉందని గ్రహించాలి.
జాగ్రత్తలు..
ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలి. ఎల్లప్పుడూ అధికారిక వెబ్సైట్లు లేదా యాప్ల ద్వారా మాత్రమే సబ్స్క్రిప్షన్లను కొనుగోలు చేయాలి. వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా వచ్చే తెలియని లింక్లను ఎప్పుడూ క్లిక్ చేయవద్దు. మీ యూపీఐ పిన్ లేదా బ్యాంకు వివరాలను ఎవరికీ చెప్పకూడదు. టెలికాం కంపెనీలు ఇచ్చే ఆఫర్లను వారి అధికారిక యాప్లలో మాత్రమే తనిఖీ చేయాలి.
మోసపోతే ఏం చేయాలి?
ఒకవేళ మీరు ఇప్పటికే ఇటువంటి మోసానికి గురైతే, వెంటనే మీ బ్యాంకుకు సమాచారం అందించి కార్డులను లేదా యూపీఐ సేవలను నిలిపివేయాలి. మీ ఖాతాల పాస్వర్డ్లను వెంటనే మార్చాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలి. అప్రమత్తంగా ఉండటమే ఇటువంటి సైబర్ నేరాల నుంచి సేఫ్టీగా ఉంటాం.

