శ్రీ సత్య సాయి జిల్లా: సత్యసాయి తాగునీటి పథకాన్ని నమ్ముకొని ఏళ్ల తరబడిగా పనిచేస్తున్నాం... సమ్మె చేసిన ప్రతిసారి జీతాలు ఇస్తున్నారు తప్ప మా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు..
ఐదు నెలలుగా జీతాలు అందకపోవడంతో మా కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు సత్యసాయి తాగునీటి పథకం పంప్ హౌస్ వద్ద సమస్యలు పరిష్కరించాలని కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు.
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ 28 సంవత్సరాలుగా 1000 గ్రామాలకు 10 లక్షల మంది ప్రజలకు సత్యసాయి తాగునీటిని అందిస్తూ పని చేస్తున్నామని, ఉద్యోగ భద్రత కానీ జీతాలు సక్రమంగా ఇవ్వడం గానీ ఈఎస్ఐ,పీఎఫ్ సౌకర్యం గాని ఎటువంటి సౌకర్యాలు మాకు లేవన్నారు. బోర్డు ఆధీనంలోనే సత్యసాయి తాగునీటి పథకం కొనసాగించాలని డిమాండ్ చేశారు. 1997 సంవత్సరం నుండి కేటాయించినట్లే రాష్ట్ర బడ్జెట్ కేటాయించాలని కోరారు. సంక్షేమ పథకాల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ప్రజల దాహార్తిని తీర్చే సత్యసాయి తాగునీటి పథకం గురించి పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు.
ఇప్పటికే ప్రజాప్రతినిధులు అధికారులు ఇచ్చిన హామీలు స్పందించి రెండు నెలల గడువు ఇచ్చామని అయినప్పటికీ మా సమస్య పరిష్కారం కాకపోవడంతో నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలియజేశారు. మా కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని పిల్లలను చదివించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణకు పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న కార్మికుల 5 నెలల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

