Suryapet: సూర్యాపేట జమ్మిగడ్డలో రాజీవ్ గాంధీ వర్ధంతి
సూర్యాపేట: కాంగ్రెస్ నేతలు సాంకేతిక విప్లవానికి నాంది పలికి దేశాన్ని ఆధునిక దిశగా నడిపించిన నాయకుడు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.డి. అంజద్ అలి ఆధ్వర్యంలో జమ్మిగడ్డలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గ్రామ పంచాయతీలకు అధికారాలు కల్పిస్తూ స్థానిక సంస్థలను బలోపేతం చేసిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారతకు మార్గం సుగమం చేశారని తెలిపారు.
దేశంలో ఐటీ, టెలికాం రంగాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ కృషి ఎంతో కీలకమని నాయకులు గుర్తు చేశారు. మారుమూల గ్రామాలకు సాంకేతికతను చేరువ చేసి యువతకు కొత్త అవకాశాలు కల్పించారని చెప్పారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా రాజీవ్ గాంధీదేనన్నారు. దేశ సమగ్రత, సమైక్యత కోసం రాజీవ్ గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ, ఆయన ఆశయాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.
అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

