Suryapet: సూర్యాపేటలో ఎకరం స్థలంలో కాంగ్రెస్ సరికొత్త కార్యాలయం
సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ డిపార్ట్మెంట్ నిర్మాణ సమావేశంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పీసీసీ పరిశీలకులు మందుల సూర్య కిరణ్, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో పదవులు తప్పకుండా వస్తాయని అన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి పారదర్శకంగా అవకాశాలు కల్పించేందుకే ఎస్సీ విభాగం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
పార్టీలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న నాయకులను గుర్తించి వారికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతితో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఎస్సీ విభాగంలో ఉపకులాలకు కూడా సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఎస్సీ విభాగంతో పాటు యూత్ కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, సేవాదళ్ తదితర విభాగాల్లో కూడా పదవుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామస్థాయిలో పార్టీ కోసం కష్టపడే నాయకులకు పదవులు వచ్చేలా తాను ముందుండి పోరాడతానని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు.
సూర్యాపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో ఎకరం స్థలంలో కొత్త కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించనున్నట్లు తెలిపారు. ఆ కార్యాలయంలో ప్రతి విభాగానికి ప్రత్యేక గదులు, పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
పార్టీ కార్యాలయ నిర్మాణ బాధ్యతలను మందుల స్వామీ తీసుకున్నారని, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి డిజైన్ రూపొందిస్తున్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు అమరారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

