Suryapet: సూర్యాపేటలో వడ్ల కొనుగోళ్లు స్పీడప్.. రూ.437 కోట్లు జమ!
సూర్యాపేట: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం జరుగుతున్నాయా లేదా అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఆత్మకూరు మండలం నెమ్మికల్ గ్రామం, మద్దిరాల మండలం నూతనకల్, పోలుమల్ల గ్రామాల్లో సాగుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించారు.
తీవ్రమైన ఎండల నేపథ్యంలో పనిస్థలాల్లో కూలీలకు కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎండ నుండి ఉపశమనం కోసం ఏర్పాటు చేసిన షెడ్లు, తాగునీరు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఓఆర్ఎస్ ప్యాకెట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజలకు ఉపాధి, ఆదాయ భద్రత కల్పిస్తుందని తెలిపారు. కూలీలు ఎక్కువ సంఖ్యలో హాజరై ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎండల తీవ్రత దృష్ట్యా కూలీలు ఉదయమే పనులు ముగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కలెక్టర్ స్వయంగా కూలీల వద్దకు వెళ్లి వేతనాలు సమయానికి జమవుతున్నాయా, ప్రభుత్వం ప్రకటించిన సగటు వేతనం అందుతుందా, పనుల్లో ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కూలీలు చెప్పిన సమస్యలను విని, తక్షణ పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సాదాసీదాగా తమతో మాట్లాడడంతో కూలీలు హర్షం వ్యక్తం చేశారు.
వడదెబ్బ తగిలిన వారికి తక్షణ వైద్యం అందించేందుకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సన్యాసయ, అడిషనల్ పీడీ చంద్రశేఖర్, ఆత్మకూరు ఎంపీడీవో హసిమ్, నూతనకల్ ఎంపీడీవో సునీత, మద్దిరాల ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఏపీడీ పవన్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

