Thimmapur: బంగారం దోచుకుని బావిలో తోసేసిన వైనం.. నిందితుడు అరెస్ట్!
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో కరీంనగర్ కిసాన్నగర్కు చెందిన లక్ష్మిని బెదిరించి బంగారం దోచుకుని బావిలో తోసేసిన ఘటన స్థలాన్ని పరిశీలించారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలాం ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని వెల్లడించారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఈ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. గతంలో కూడా ఇదే తరహాలో ఓ మహిళా కూలీని పని ఉందని నమ్మించి బంగారం లాక్కొని గదిలో బంధించిన ఘటనలో కూడా నిందితుడి ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్, లేబర్ శాఖ అధికారులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి నివారణ చర్యలు చేపడతామని సీపీ తెలిపారు. సీపీ వెంట ఏసీపీ వెంకటస్వామి, త్రీ టౌన్ సీఐ తిరుమల్, వన్ టౌన్ సీఐ రామ్చందర్రావు, తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేష్, ఎల్ఎండీ ఎస్ఐ సయ్యద్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

