Tiruchanur: సుందరరాజస్వామి అవతార మహోత్సవాలు వీధుల్లో లక్ష్మీనారాయణుడు!
తిరుచానూరు: శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారు పెద్దశేష వాహనం పై భక్తులకు కనువిందు చేశారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన, తోమాల సేవ నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామి ఉత్సవర్లకు అభిషేకం చేశారు.
సాయంత్రం శ్రీ సుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్దశేష వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం విశేషాలంకరణలో విరాజిల్లుతున్న స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరాజస్వామి వారు రూపంలో పెద్దశేష వాహనం పై కొలువుదీరి నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు.
పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏవీఎస్వో రాధాకృష్ణ, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు రమేష్, మునిచెంగల్రాయులు, సురేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, మునస్వామి, చలపతి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, బాబు స్వామి, వేంపల్లి శ్రీనివాసులు స్వామి, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

