US-Israel-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై భారత్ హర్షం.. శాశ్వత శాంతి నెలకొనాలని ఆకాంక్ష!
India Welcomes US-Iran Ceasefire: పశ్చిమాసియాలో గత 40 రోజులుగా కొనసాగుతున్న భీకర పోరుకు తాత్కాలిక విరామం లభించడంపై భారతదేశం సానుకూలంగా స్పందించింది.
అమెరికా మరియు ఇరాన్ దేశాలు కాల్పుల విరమణకు (US-Iran ceasefire) అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది.
శాంతికి దౌత్యమే మార్గం
ఈ మేరకు విదేశాంగ శాఖ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. "అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయం పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి పునాది వేస్తుందని ఆశిస్తున్నాం. ఉద్రిక్తతలను తగ్గించుకోవడం, నిరంతర సంప్రదింపులు మరియు దౌత్య మార్గాల ద్వారానే ఏ సంఘర్షణకైనా పరిష్కారం లభిస్తుందని భారత్ ఎప్పుడూ నమ్ముతుంది" అని పేర్కొంది.
ప్రపంచ వాణిజ్యంపై ఆందోళన
యుద్ధం వల్ల కలిగిన నష్టాలను ప్రస్తావిస్తూ.. "ఈ పోరు కారణంగా ఇప్పటికే సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ప్రపంచ ఇంధన సరఫరా మరియు అంతర్జాతీయ వాణిజ్య నెట్వర్క్లకు తీవ్ర అంతరాయం కలిగింది. తాజా ఒప్పందంతో హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా నౌకల రాకపోకలకు ఆటంకాలు తొలగిపోతాయని ఆశిస్తున్నాం" అని భారత్ వెల్లడించింది.
నేపథ్యం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కాల్పుల విరమణను ప్రకటించగా, దానికి ఇరాన్ కూడా అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ ఒప్పుకోవడం అంతర్జాతీయ మార్కెట్లకు పెద్ద ఊరటనిచ్చింది. ఈ కీలక మలుపుతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి తొలిగిపోయినట్లయింది.

