Vatapalem: వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరి: ఎస్సై పి. జనార్ధన్
వేటపాలెం (బాపట్ల జిల్లా): బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశానుసారం చీరాల డి.ఎస్.పి మహమ్మద్ మోయిన్, రూరల్ సీఐ ఉప్పుటూరి సుధాకర్ రావు సూచనల మేరకు
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని వేటపాలెం ఎస్సై పి. జనార్ధన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గురువారం రాత్రి వేటపాలెం సెంటర్లో నిర్వహించిన ప్రజా అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటంతో పాటు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనం యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.
ఇటీవల మారకద్రవ్యాలు, గంజాయి వినియోగం యువతలో పెరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్న ఎస్సై, ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులు ఓపెన్ చేయకూడదని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దని అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు, "సైబర్ మసాలా" వంటి మోసపూరిత సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని సూచించారు.
ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్సై పి. జనార్ధన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువకులు, వ్యాపారులు పాల్గొన్నారు.

