Vikarabad: వికారాబాద్లో అర్ధరాత్రి ఆపరేషన్.. రోడ్డుపైకి ఎస్పీ!
వికారాబాద్: వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు జిల్లాలో ఈ రోజు సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన కూడళ్లు, చౌరస్తాలు మరియు ప్రధాన రహదారుల వద్ద ఏకకాలంలో డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు మరియు నకబందీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించబడినవి.
ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా మరియు అలంపల్లి చౌరస్తాలలో జిల్లా ఎస్పీ ఆకస్మికంగా వాహనాల తనిఖీలను పరిశీలించి, విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు పలు సూచనలు మరియు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ
జిల్లాలో నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ క్రమశిక్షణ పరిరక్షణ, అక్రమ రవాణా అరికట్టడం మరియు డ్రంక్ & డ్రైవ్ కేసులను తగ్గించడమే లక్ష్యంగా నకబందీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. డ్రైవింగ్ సమయంలో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, నిరపరాధుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
ఇంకా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మొబైల్ చెక్ డివైస్ల ద్వారా అనుమానితుల వేలిముద్రలను సేకరించి తనిఖీలు నిర్వహిస్తున్నామని, దీని ద్వారా పాత నేరస్తులు మరియు వాంఛనీయ వ్యక్తులను గుర్తించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ధరించడం వంటి అంశాలపై కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ప్రయాణించాలని ఎస్పీ సూచించారు.
జిల్లాలో శాంతి భద్రతలు కాపాడడం, ప్రజలకు భద్రత కల్పించడం కోసం ఇలాంటి ఆకస్మిక నకబందీ కార్యక్రమాలు ఇకముందు కూడా నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి జిల్లా ప్రశాంత వాతావరణాన్ని పరిరక్షించడంలో భాగస్వాములు కావాలని తెలిపినారు.

