AP: బాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు.. తాడేపల్లిలో కొవ్వొత్తుల నిరసన!
AP: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీతి, నిజాయితీకి నిలువుటద్దమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.
సవిత అన్నారు. మూడేళ్ల క్రితం ఇదే రోజున ఆనాటి వైసీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసి నిర్బంధించిందని, అయితే న్యాయస్థానాలు, ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆయనకు అండగా నిలిచారని తెలిపారు. చివరకు నిజం గెలిచి, చంద్రబాబు అక్రమ కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని పేర్కొన్నారు.
2023లో చంద్రబాబు నాయుడు అరెస్టయిన ఘటనను గుర్తు చేసుకుంటూ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి మంత్రి సవిత నేతృత్వంలో కూటమి నాయకులు, మహిళలు కొవ్వొత్తులు వెలిగించారు. 'సీఎం చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి', 'నిజమే గెలిచింది' అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. తన అసమర్థ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, మరోవైపు చంద్రబాబు నాయుడుకు రోజురోజుకూ పెరుగుతున్న ప్రజామద్దతును చూసి జగన్ ఓర్వలేకపోయారని విమర్శించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎప్పుడూ అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. అయినప్పటికీ రాజకీయ కక్షసాధింపుతో ఆయనపై తప్పుడు కేసులు పెట్టి 53 రోజుల పాటు జైలులో నిర్బంధించారని ఆరోపించారు.
చంద్రబాబు అరెస్టును తెలుగు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని మంత్రి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి తమ నిరసనను తెలియజేశారని చెప్పారు. విదేశాల్లోని ఎన్ఆర్ఐలు సైతం చంద్రబాబు విడుదల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించారని గుర్తుచేశారు. చంద్రబాబు అరెస్టుపై న్యాయపరమైన పోరాటం కూడా కొనసాగిందన్నారు.
చివరకు న్యాయస్థానాల నుంచి లభించిన ఊరటతో చంద్రబాబు బయటకు వచ్చారని, ఈ ఘటన ఎప్పటికైనా నిజం, ధర్మమే గెలుస్తాయని నిరూపించిందని మంత్రి సవిత అన్నారు. ఎన్ని రాజకీయ కుట్రలు ఎదురైనా, 53 రోజుల పాటు జైలులో నిర్బంధించినా చంద్రబాబు వెనుకంజ వేయలేదని, ప్రజల పక్షాన నిలిచి తన పోరాటాన్ని కొనసాగించారని చెప్పారు.
చంద్రబాబు విడుదల కోసం 53 రోజుల పాటు పరితపించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలకు మంత్రి సవిత కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో కక్షసాధింపులకు తావు ఉండకూడదని హితవు పలికారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని మంత్రి విమర్శించారు. నీలి మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ప్రజలు ఇప్పటికే వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని కుట్రలు చేస్తున్న వైసీపీకి ప్రజలు మరోసారి సరైన సమాధానం చెప్పాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

