Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vladimir Putin: మరోసారి భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్

Vladimir Putin: మరోసారి భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్

hmtv 5 days ago

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత పర్యటనకు రానున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఆయన మనదేశాన్ని సందర్శించనున్నట్లు రష్యా అధ్యక్ష భవనం 'క్రెమ్లిన్' ప్రతినిధి యూరీ ఉషకొవ్‌ అధికారికంగా వెల్లడించారు.

దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబరు 12-13వ తేదీల్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పుతిన్ నేరుగా పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏడాది వ్యవధిలోనే రెండోసారి భారత్‌లో పర్యటించనుండటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా గతేడాది డిసెంబరులో (2025) ఆయన మనదేశానికి వచ్చారు. ఆ సమయంలో ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ప్రధాని నరేంద్ర మోదీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

ఈ ఏడాది (2026) బ్రిక్స్ కూటమికి భారత్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల దిల్లీలోని భారత్ మండపంలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరై, ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం సహా పలు అంతర్జాతీయ భౌగోళిక అంశాలపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి.

ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న పుతిన్.. సెప్టెంబరు నాటి భారత సదస్సు కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో 'బ్రిక్' (BRIC) గా ఏర్పడిన ఈ కూటమి, ఆ తర్వాత దక్షిణాఫ్రికా చేరడంతో 'బ్రిక్స్' (BRICS) గా రూపాంతరం చెందింది.

పూర్తి స్థాయి సభ్య దేశాలు (10): బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (UAE), ఇండోనేసియా. ఈ పది దేశాలను కలిపి ప్రస్తుతం 'బ్రిక్స్ ప్లస్' గా వ్యవహరిస్తున్నారు.

చేరాల్సిన దేశాలు: సౌదీ అరేబియా, అర్జెంటీనాలు ఇంకా లాంఛనంగా ఈ కూటమిలో భాగస్వామ్యం కాలేదు. గతేడాది బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో ఈ సదస్సు విజయవంతంగా జరిగిన సంగతి తెలిసిందే.

భారత్ నేతృత్వంలో సెప్టెంబరులో జరగనున్న ఈ సదస్సులో రష్యా, చైనాలతో పాటు మిగిలిన సభ్య దేశాల అగ్రనేతలు హాజరుకానుండటంతో గ్లోబల్ పాలిటిక్స్‌లో దిల్లీ వేదికగా సరికొత్త సమీకరణాలు మారే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu