Dailyhunt
Weather Upadate :  ఏపీ, తెలంగాణలో భానుడి భీభత్సం.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన

Weather Upadate : ఏపీ, తెలంగాణలో భానుడి భీభత్సం.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన

hmtv 1 week ago

Weather Upadate : తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. మే నెల ప్రారంభంలోనే ఎండలు ముదురుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో జనం అల్లాడిపోతున్నారు.

ఒకవైపు సెగలు పుట్టించే ఎండలు, మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు.. ఇలా భిన్నమైన వాతావరణంతో తెలుగు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రకాశం జిల్లా రికార్డు

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పతాక స్థాయికి చేరింది. శనివారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో ఏకంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యధికంగా నిలిచింది. తిరుపతి, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో కూడా 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 239 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆదివారం కూడా 124 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో రికార్డు స్థాయిలో 46 డిగ్రీలు

తెలంగాణలో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ సీజన్‌లోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. నల్గొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంది. రాజధాని హైదరాబాద్‌లో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ఎల్లుండి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.

అకాల వర్షాలు - పిడుగుల ముప్పు

ఎండలతో పాటుగా ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు కూడా భయపెడుతున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా కొన్ని చోట్ల ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఎండల వల్ల భూమి వేడెక్కి ఆకస్మికంగా మేఘాలు ఏర్పడటం వల్ల ఈ పిడుగులు పడే అవకాశం ఉందని, ఈ సమయంలో ప్రజలు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల కింద గానీ ఉండకూడదని సూచించారు.

రైతులకు, ప్రజలకు కీలక సూచనలు

పంటలు చేతికొచ్చే సమయంలో ఈ అకాల వర్షాలు రైతులకు శాపంగా మారాయి. రైతులు తమ పంట ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని లేదా పరదాలతో కప్పి ఉంచుకోవాలని అధికారులు కోరుతున్నారు. ప్రజలు మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాధ్యమైనంత వరకు బయటకు రావొద్దని సూచించారు. బయటకు వెళ్లాల్సి వస్తే తలకు గొడుగు లేదా రుమాలు కట్టుకోవాలని, తగినంత మంచినీరు, ఓఆర్ఎస్ లిక్విడ్ వంటివి తీసుకోవాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu