Weather Update: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
Weather Update: వేసవి తాపంతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు.
జిల్లా వారీగా వర్ష సూచన:
శుక్రవారం: ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శనివారం: ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్తో పాటు జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో వానలు పడవచ్చు.
ఆదివారం: వర్ష విస్తృతి పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, జనగామ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎల్లో అలర్ట్ జారీ:
పైన పేర్కొన్న జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. ముఖ్యంగా ఈదురుగాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ ధాన్యం నిల్వలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

