ఎమ్మిగనూరు: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిపిఐ ఆధ్వర్యంలో ఓ వినూత్నమైన నిరసన చేపట్టారు. ఇంధన ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ..
సిపిఐ నాయకులు రోడ్డుపైకి వచ్చారు.స్థానిక పెట్రోల్ బంక్ ముందు సిపిఐ నాయకులు, వినూత్న రీతిలో తమ నిరసనను ప్రదర్శించారు. నిత్యావసర సేవలకు ఉపయోగించే అంబులెన్స్ను తాళ్లతో కట్టి, చేతులతో లాగుతూ పెట్రోల్ బంక్ వరకు తీసుకువచ్చారు.
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో.. భవిష్యత్తులో వాహనాలు నడపలేక ఇలా లాక్కోవాల్సి వస్తుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఒకలా, గెలిచిన తర్వాత మరోలా వ్యవహరించడం సరికాదన్నారు.ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సామాన్యుడి ఇబ్బందులను పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సిపిఐ నాయకులు హెచ్చరించారు..

