కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన
సీపీఐ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి
హయత్నగర్లో సీపీఐ భారీ నిరసన
హయత్ నగర్, మే 16 (జనం సాక్షి )
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పెంచుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ హయత్నగర్ మండల సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
సీపీఐ మండల సహాయ కార్యదర్శి కర్నే సుజాత అధ్యక్షతన జరిగిన ఈ ఆందోళన కార్యక్రమానికి సీపీఐ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మోదీ దిష్టిబొమ్మ దహనం చేసి, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా సామిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకూ ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అందుబాటులో ఉన్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంధన ధరలను తగ్గించకుండా ప్రజలను దోచుకుంటోందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల రవాణా ఛార్జీలు పెరిగి ఉప్పు, పప్పుల దగ్గరి నుండి అన్ని రకాల సరుకుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ పెంచిన ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించకపోతే, భవిష్యత్తులో సీపీఐ, అన్ని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమం లో లెక్చరర్స్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు సామిడి వంశీ వర్ధన్ రెడ్డి, బొంగు అరుణ్ కుమార్ గౌడ్, హైకోర్టు కాలనీ డివిజన్ అధ్యక్షులు చెంది వెంకట్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మండల కార్యదర్శి కొప్పుల సరిత, ఏఐటీయూసీ మండల కార్యదర్శి పట్టేటి శేఖర్, అధ్యక్షుడు గోల్కొండ నాగరాజు, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఇసంపల్లి వెంకట్, డీహెచ్పీఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి పాల్వాయి సురేందర్, మండల బీఓసీ నాయకులు బొడ్డు శ్రీను, సామ్యూల్, వివిధ శాఖల కార్యదర్శులు సౌజన్య, శివజ్యోతి, వెంకట్, చంటి, సుజాత, గిరి, రమేష్, వీరస్వామి ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

