ఉర్కొండ మే 14, ( జనం సాక్షి ) : ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి, రేవల్లి, గుడిగానిపల్లి గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తో కలిసి గురువారం విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామాలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ తాగునీటి సదుపాయాలు, అంతర్గత రహదారులు, పారిశుధ్యం తదితర అంశాలను ఎమ్మెల్యే మరియు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.అలాగే గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన పనులపై స్థానిక ప్రజలు, గ్రామ పెద్దల అభిప్రాయాలను సేకరించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల అవసరాలను గుర్తించి ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

