రేగొండ,మే 15 (జనం సాక్షి); కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూస్తున్నా మక్కలను కొనుగోలు చేయటంలేదని ఆరోపిస్తూ రేగొండ మండలం లింగాల గ్రామ రైతులు శుక్రవారం మిల్లు ఎదుట రోడ్డుపై ధర్నాకు దిగారు.ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు మిల్లుల వద్ద ట్రాక్టర్లతో పడిగాపులు కాస్తున్నా పట్టించుకొకపోవటం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఆరు రోజులుగా మక్క లోడ్లతో మిల్లు వద్దే ఉంటున్నా… అధికారులు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు మాజీ ఎమ్మెల్యే తో చెప్పుకున్నారు. ఒక్కో ట్రాక్టర్కు రెండు వేల రూపాయల వరకు కిరాయి చెల్లించాల్సి వస్తోందని, ఇప్పటికే వేలాది రూపాయలు నష్టపోయామని రైతులు వాపోయారు. వెంటనే కొనుగోలు ప్రారంభించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ…రైతులను ఇంతలా ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు.పంట పండించేందుకు రైతు చేసిన కష్టాన్ని ప్రభుత్వం గౌరవించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, వెంటనే అధికార యంత్రాంగం స్పందించి మక్క కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.రైతుల సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.

