హయత్ నగర్, మే 15 (జనం సాక్షి) హయత్ నగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో "99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" విద్య వారోత్సవా లలో భాగంగా కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో "మన గ్రంథాలయ జ్ఞానోత్సవం - విశ్వ గ్రంథాలయ దినోత్సవం" కార్యక్రమాన్ని నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేష్ బాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పుస్తక ప్రదర్శన ప్రారంభించి, బుక్ టాక్స్, పుస్తక దాన కార్యక్రమం, ఉత్తమ పాఠకుల సన్మానం, గ్రంథాలయ సేవల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తమ అధ్యాపక పాఠకులు విద్యాసాగర్, ఉత్తమ విద్యార్థి పాఠకులు ఆదిత్య బిఎ సెకండ్ ఇయర్ విద్యార్థి, కళాశాల గ్రంథాలయానికి పుస్తక దాతలను, శుభాసిని, డాక్టర్ గీత నాయక్, డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు లకు సన్మానం చేశారు.కళాశాల గ్రంథపాలకులు డాక్టర్ ఎ. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ వివిధ పోటీ పరీక్షలు, డిగ్రీ కోర్సుల అవకాశాలు, పీజీ ప్రవేశ పరీక్షలు, వివిధ సబ్జెక్టుల భవిష్యత్ అవకాశాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులకు సమగ్రంగా వివరించారు. చదువు అలవాటు, గ్రంథాలయ వినియోగం విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా భారత రాజ్యాంగానికి సంబంధించిన అరుదైన ప్రతిని ప్రదర్శించారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పరిశీలించి గ్రంథపాలకుని కృషిని వారు అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, గ్రంథాలయాలు జ్ఞానం, ప్రేరణ, వ్యక్తిత్వ వికాసానికి కేంద్రబిందువులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉత్సాహంగా పాల్గొన్నారు.

