పర్వతగిరి: మె 16 (జనం సాక్షి) కల్లెడ గ్రామ శివారులో ముంజాలకుంట తండా వద్ద గల మామిడి తోటలో పనిచేయడానికి వచ్చి విద్యుత్ షాక్ కు గురై మరణించిన మైనర్ బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని అందుకు బాధ్యులైన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ పర్వతగిరి మండల ఇన్చార్జి గారె జయరాజ్ మరియు జేరిపోతుల వంశీకృష్ణ డిమాండ్ చేశారు.
ఈ మేరకు నేషనల్ హ్యూమన్ రైట్స్ పర్వతగిరి మండల కమిటీ తరఫున పర్వతగిరి మండల తహశీల్దార్ టి. వెంకటస్వామి గారికి మెమోరాండం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మైనర్ బాలురులను పనికి తీసుకువచ్చిన సదరు వ్యక్తి పై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అతని నిర్లక్ష్యం వల్లనే బాలుడు మరణించాడని అన్నారు.
ఈ సంఘటన పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ బాలుడి కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. ఇందులో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కూడా ఉందని వారు కూడా శాఖ పరంగా బాధ్యత వహించాలని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదకరమైన లైన్ లను గుర్తించి వాటిని తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. మరణించిన బాలుడి కుటుంబానికి నష్టపరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ప్రమాదకరమైన పనులకు మైనర్లను తీసుకొచ్చే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను కోరారు.

