చేర్యాల (జనంసాక్షి) మే 15 : దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు కేంద్ర విద్యాశాఖ మంత్రి పూర్తి బాధ్యత వహించాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, ప్రస్తుతం వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సిద్ధమైన విద్యార్థుల ఆశలపై ఈ పేపర్ లీకేజీ నీళ్లు చల్లినట్టైందని ఆవేదన వ్యక్తం చేశారు. సమయం కేటాయించి శ్రమించిన విద్యా ర్థులు తీవ్ర అయోమయంలో ఉన్నారని, పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తన పారదర్శకతను నిరూపించుకోవడంలో విఫలమైందని విమర్శించారు.
నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన కార్పొరేట్ విద్యా మాఫియాపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో నిష్పక్షపాతంగా విచారణ జరిపి, లీకేజీకి కారణమైన ప్రతీ ఒక్కరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి విద్యా రంగంపై ఉన్న నిర్లక్ష్యం ఈ ఘటనతో బహిర్గతమైందని ఆరోపించారు. ఇలాంటి పేపర్ లీకేజీల కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ద చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల కోశాధికారి నంగి కనకయ్య, మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు పొన్నబోయిన మమత, సుంకోజు రజిత, మండల కార్యవర్గ సభ్యులు ఎగుర్ల ఎల్లయ్య, గోమారపు నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

