79వ ఫెస్టివల్ డి కేన్స్లో రష్మీ ఠాకూర్ అరంగేట్రం
భూదాన్ పోచంపల్లి, మే 21 (జనం సాక్షి): ఫెస్టివల్ డి కేన్స్ వేదికగా తెలంగాణ చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
రష్మీ ఠాకూర్ 79వ ఫెస్టివల్ డి కేన్స్లో అరంగేట్రం చేస్తూ ఎంతో చరిత్ర కలిగిన పోచంపల్లి ఇక్కత్ కూచర్ దుస్తులను ప్రదర్శించారు. పోచంపల్లి టు కేన్స్ అనే నేపథ్యంతో తెలంగాణ చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. తెలంగాణ మాస్టర్ నేతన్నలు చేతితో నేసిన ఇకత్ వస్త్రాలకు ప్రఖ్యాత హైదరాబాది ముత్యాలు జత కావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిజాంల కాలం నాటి ఆభరణాల వైభవాన్ని ప్రతిబింబించే ఈ ముత్యాలు, ఇకత్ నేతలోని ప్రత్యేక డిజైన్కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.
ఈ సందర్భంగా రష్మీ ఠాకూర్ మాట్లాడుతూ ఇది నా వ్యక్తిగత అరంగేట్రం మాత్రమే కాదు తెలంగాణ అరంగేట్రం. 200 ఏళ్ల చరిత్రను మగ్గాల దారాల్లో నింపిన పోచంపల్లి నేతన్నలందరికీ ఇది అంకితం అని తెలిపారు. అలాగే భారత ప్రభుత్వం, చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వం, వీవర్స్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్ అధికారులు, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తడక రమేష్ మాట్లాడుతూ ప్రపంచ వేదికైన ఫెస్టివల్ డి కేన్స్లో పోచంపల్లి ఇక్కత్ చేనేత వస్త్రాలను ప్రదర్శిస్తూ ప్రపంచస్థాయి ప్రచారం కల్పిస్తున్న రష్మీ ఠాకూర్కు చేనేత కళాకారులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. పోచంపల్లి చేనేత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ఆమె చేస్తున్న కృషి ప్రతి నేతన్నకు గర్వకారణమని పేర్కొన్నారు. మే 13 నుంచి 24 వరకు జరుగుతున్న 79వ ఫెస్టివల్ డి కేన్స్లో రష్మీ ఠాకూర్ హాజరు భారతీయ చేనేతకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకొచ్చిందని చేనేత వర్గాలు అభిప్రాయపడ్డాయి.

