జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):భూపాలపల్లి పట్టణంలో రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, విస్తరణ పనులను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు.
పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్, రాజీవ్ జంక్షన్, జయశంకర్ జంక్షన్, సర్వాయి పాపన్న జంక్షన్లను విస్తరించి, రోడ్డు వెడల్పు చేసేందుకు గాను స్థల పరిశీలన చేశారు. అదేవిధంగా పట్టణంలోని నాలుగు జంక్షన్ లతోపాటు అంబేద్కర్ సెంటర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ, షాపింగ్ కాంప్లెక్స్ ల ఏర్పాటు కోసం వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ బుర్ర కొమురయ్య మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల వెడల్పుతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించి, చిరు వ్యాపారులకు అందించడం జరుగుతుందని అన్నారు.
అదేవిధంగా పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహాయ సహకారాలతో పట్టణంలో అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని, ఇందులో భాగంగా స్థల పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి, పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా చైర్మన్ కొమురయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొడ్డు అశోక్, బౌతు శోభ రాజేష్, రాజు నాయక్, మున్సిపల్ ఏఈ మానస, టిపీఓ సునీల్ కుమార్, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

