ఉప్పల్, మే 15 (జనం సాక్షి): ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయంలో శని జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక తైలాభిషేకాలు, శని దేవుని ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.శని జయంతి సందర్భంగా నిర్వహించిన తైలాభిషేకాలు, అర్చనలు, హోమాలు మరియు ఇతర ధార్మిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, శుభసమృద్ధులు కలగాలని ప్రార్థించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడే ఆలయాలు సమాజానికి ఆధ్యాత్మిక కేంద్రాలుగా నిలుస్తున్నాయని అన్నారు. పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.శని జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు, యువకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

