దోహా: ఖతార్లో కనాద్ (కింగ్ఫిష్) చేపల సంరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది అమలు చేసే వార్షిక నిషేధంలో భాగంగా ఈసారి ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 31 వరకు కనాద్ చేపల వేటపై ఆంక్షలు అమల్లో ఉంటాయని మునిసిపాలిటీ మంత్రిత్వశాఖ పరిధిలోని మత్స్యశాఖ ప్రకటించింది.
ఈ నిషేధ కాలంలో మన్సాబ్ నెట్లు ఉపయోగించి కనాద్ చేపల వేట చేపట్టడం పూర్తిగా నిషేధం. అలాగే ఈ నెట్లను రవాణా చేయడం, కొనుగోలు, విక్రయించడం కూడా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. అయితే, హుక్ అండ్ లైన్ (గాలం) పద్ధతిలో కనాద్ చేపల వేటకు మాత్రం అనుమతి కొనసాగుతుందని మత్స్యశాఖ వెల్లడించింది.
సముద్ర జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, కనాద్ చేపల నిల్వలను పెంపొందించడం, సముద్ర వనరుల సుస్థిర వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ వార్షిక నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, 2025లో ఖతార్లో కనాద్ చేపల ఉత్పత్తి సుమారు 3,484 టన్నులకు చేరిందని మునిసిపాలిటీ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

