అమెరికా: అమెరికా రక్షణ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ ఇడాహో (Idaho) రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. యూఎస్ వైమానిక దళానికి చెందిన రెండు అత్యాధునిక 'EA-18G గ్లోలర్' ఫైటర్ జెట్ యుద్ధ విమానాలు గాల్లో విన్యాసాలు చేస్తూ ప్రమాదవశాత్తూ ఒకదానికొకటి అత్యంత వేగంతో ఢీకొన్నాయి.
ఇడాహోలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "గన్ ఫైటర్ స్కైస్ ఎయిర్ షో" (Gunfighter Skies Air Show) లో భాగంగా వేలాది మంది ప్రేక్షకులు చూస్తుండగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాల్లో విన్యాసాలు చేస్తూ కళ్ళు చెదిరే ప్రదర్శన ఇస్తున్న తరుణంలో ఈ రెండు విమానాలు పరస్పరం గుద్దుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా భయాందోళనలకు గురయ్యారు.
రెండు యుద్ధ విమానాలు గాల్లో ఢీకొన్న మరుక్షణమే భారీ పేలుడు సంభవించి, విమాన శకలాలు కిందపడిపోయాయి. ప్రమాదం జరిగిన తీవ్రతకు ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది. అక్కడి దృశ్యాలు అత్యంత భీతావహంగా మారాయి. అయితే, ఈ పెను ప్రమాదం జరిగిన వెంటనే విమానాల్లోని నలుగురు పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. విమానాలు పూర్తిగా అగ్నికి ఆహుతి కాకముందే వారు ఎజెక్ట్ (Eject) బటన్ ద్వారా పారాచూట్ల సహాయంతో సురక్షితంగా కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. పైలట్లు పారాచూట్ల ద్వారా కిందకు దిగుతున్న దృశ్యాలు అక్కడి సోషల్ మీడియా వీడియోలలో స్పష్టంగా కనిపించాయి.
ఈ అసాధారణ ప్రమాదం నేపథ్యంలో అప్రమత్తమైన ఉన్నతాధికారులు "మౌంటేన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్" (Mountain Home Air Force Base) ను తక్షణమే మూసివేసి హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్ షోను రద్దు చేసి, బేస్ పరిసర ప్రాంతాలలోకి ఎవరినీ అనుమతించడం లేదు. పారాచూట్ల సాయంతో ప్రాణాలతో బయటపడిన నలుగురు పైలట్లను తక్షణమే ఆర్మీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అసలు అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లు ఉన్నప్పటికీ ఈ రెండు యుద్ధ విమానాలు గాల్లో ఎలా ఢీకొన్నాయి? సాంకేతిక లోపమా లేక కమ్యూనికేషన్ వైఫల్యమా? అనే కోణంలో ఉన్నత స్థాయి విచారణకు అమెరికా రక్షణ శాఖ ఆదేశించింది.

