మనామాః జుఫైర్ ప్రాంతంలోని ఒక నివాసం నుండి 8 లక్షల బహ్రెయిన్ దినార్లకు పైగా విలువైన బంగారం, విలాసవంతమైన గడియారాలు, విలువైన సేకరణ వస్తువులను దొంగిలించినందుకు బహ్రెయిన్లోని నాల్గవ జూనియర్ క్రిమినల్ కోర్టు ముగ్గురు నిందితులకు ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
దొంగిలించిన వస్తువులని తెలిసి కూడా వాటిని దాచిపెట్టి, తమ వద్ద ఉంచుకున్నందుకు మరో ఐదుగురు నిందితులకు ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్షలు విధించారు.
దొంగిలించబడిన వస్తువులలో 22 రోలెక్స్ గడియారాలు, సుమారు 1.5 కిలోగ్రాముల బంగారం, మాస్టర్ బెడ్రూమ్లోని ఒక భద్రమైన సేఫ్లో దాచి ఉంచిన బంగారం ఉందని పేర్కొన్నారు. బహ్రెయిన్ రాజధాని గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ దర్యాప్తు అధికారులు నిఘా ఫుటేజీని సమీక్షించి, దొంగతనం జరిగిన రోజున నివాసం సమీపంలో ఒక అనుమానాస్పద వాహనాన్ని గుర్తించారు. తదుపరి దర్యాప్తులో పోలీసులు అనుమానితులలో ఒకరిని గుర్తించారు. అతను నేరాన్ని ఒప్పుకోవడంతో మిగిలిన నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.

