అమెరికా: అమెరికాలో వలస విధానాలు, ముఖ్యంగా ఐటీ రంగానికి ఇచ్చే H-1B వీసాలపై అక్కడి రాజకీయ నాయకులు తరచూ చేసే విమర్శలు ఈసారి కొత్త వివాదానికి తెరలేపాయి.
అమెరికా సెనేటర్ ఎరిక్ ష్మిట్ H-1B, L-1, F-1 వంటి వీసా ప్రోగ్రామ్ల వల్ల అమెరికాలోని మధ్యతరగతి పౌరులు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆరోపించారు. అయితే, ఈ క్రమంలో ఆయన హైదరాబాద్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిల్కూరు బాలాజీ ఆలయాన్ని 'వీసాల దేవాలయం' అని సంబోధించడం, భారతీయులు అమెరికా ఉద్యోగాలను లాగేసుకుంటున్నారనే ధోరణిలో మాట్లాడటం తీవ్ర కలకలం రేపింది.
ఈ వ్యాఖ్యల పై భారతీయ నెటిజన్లు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు, అక్కడి సాంకేతిక విప్లవానికి భారతీయులు అందిస్తున్న సహకారాన్ని విస్మరించి, ఎన్నికలు లేదా రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి విమర్శలు చేయడం తగదని హితవు పలుకుతున్నారు. చట్టబద్ధంగా, తమ ప్రతిభ ఆధారంగానే భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్నారని, ఒక పవిత్రమైన ఆలయ విశ్వాసాలను ఈ వివాదంలోకి లాగడం అత్యంత దురదృష్టకరమని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

