మనామా: బహ్రెయిన్లో ప్రజలు.. ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలు అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారిచ్చే ఫుడ్ లేదా డ్రింక్స్ ను తీసుకోవద్దు. భద్రత కోసం బహిరంగ ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండాలని హిద్ పోలీస్ స్టేషన్ అధిపతి కల్నల్ డాక్టర్ ఒసామా బహార్ విజ్ఞప్తి చేస్తున్నారు.
అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన అల్ అమాన్ సోషల్ మీడియా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అలాగే, తల్లిదండ్రులు తమ పిల్లలను వారు విశ్వసించే వ్యక్తుల సంరక్షణలో మాత్రమే పెట్టాలని సూచించారు. తమను తాము ఎలా రక్షించుకోవాలో తమ పిల్లలకు అవగాహన కల్పించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు.
గత కొన్నేళ్లుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో పానీయాలలో మత్తుమందు కలిపిన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేశారు. కాగా, బహ్రెయిన్లో అటువంటి సంఘటనలు లేవని, అయితే ప్రజల భద్రతను నిర్ధారించడానికి అధికారులు నివారణ చర్యలు తీసుకుంటున్నారని కల్నల్ డాక్టర్ బహార్ చెప్పారు.
ఏదైనా జరిగితే, వెంటనే మీ కుటుంబ సభ్యులను లేదా స్నేహితులకు సమాచారం అందించాలన్నారు. అది సాధ్యం కాకపోతే, పోలీసులకు ఫోన్ చేయాలని సూచించారు. అలాగే, 999 నంబర్ ద్వారా అత్యవసర సేవలకు కాల్ చేసి అవసరమైన సాయం పొందవచ్చని సూచించారు.
ఒక అధ్యయనం ప్రకారం, గత సంవత్సరం దాదాపు పది లక్షల మంది యూకే వాసుల డ్రింక్స్ లలో మత్తుమందు కలపడం వల్ల బాధితులయ్యారు. సుమారు రెండు శాతం మంది గత 12 నెలల్లో స్పైకింగ్ బాధితులుగా ఉన్నట్లు నివేదించారు. ఇందులో మహిళలు అత్యధికంగా (58 శాతం) బాధితులుగా ఉన్నట్లు తేలింది. కాగా 25 నుండి 34 సంవత్సరాల వయస్సు వారు అత్యధిక సంఖ్యలో సంఘటనలను నివేదించారు. ఈ పోల్ను 2025 వేసవిలో యూగోవ్ (YouGov) సంస్థ నిర్వహించింది. ఇందులో 7,256 మంది ల్గొన్నారు.

