హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుత మావోయిస్టు పరిస్థితులు, తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, భద్రతా చర్యలపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) కార్యాలయాన్ని సందర్శించి భద్రతా పరిస్థితులపై సమగ్రంగా డీజీపీ సి.వి.ఆనంద్ చర్చించారు.
మావోయిస్టు ప్రభావాన్ని సమర్థవంతంగా తగ్గించడంలో ఎస్ఐబీ అధికారులు, సిబ్బంది చూపుతున్న కృషిని అభినందించారు. ముఖ్యంగా భూగర్భ సీపీఐ (మావోయిస్టు) కేడర్ల భారీ స్థాయిలో లొంగుబాట్లకు దోహదపడిన ఇంటెలిజెన్స్ ఆధారిత పోలీసింగ్, సమన్వయపూర్వక చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
తెలంగాణలో మావోయిస్టు ప్రభావం గణనీయంగా తగ్గడం పోలీసు శాఖ కట్టుదిట్టమైన వ్యూహాలు, సమాచార సేకరణ, సమర్థవంతమైన చర్యలకు నిదర్శనమని తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టు కేడర్ల పునరావాసం, సమాజంలో తిరిగి కలిసిపోయే చర్యలపై కూడా సమీక్ష నిర్వహించారు. వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు, నిరంతర సహకారం అందించడం ద్వారా సమాజంలో స్థిరపడేలా చేయాలని సూచించారు.
ప్రస్తుత మారుతున్న భద్రతా పరిస్థితుల్లో ఎస్ఐబీ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, యువతపై ప్రభావం చూపుతున్న సామాజిక ధోరణులు, సోషల్ మీడియా ప్రభావాలను నిరంతరం అధ్యయనం చేయాలని ఆదేశించారు. భవిష్యత్ భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు.

