Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎతిహాద్ రైల్‌లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..

ఎతిహాద్ రైల్‌లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..

maa gulf 3 weeks ago

బుదాబి: యూఏఈలో ప్రారంభమైన తొలి ప్యాసింజర్ రైలు సేవ ఎతిహాద్ రైల్ ప్రయాణికుల కోసం నిబంధనలు మరియు ఉల్లంఘనలకు సంబంధించిన పూర్తి జాబితాను ప్రకటించింది.

ఉల్లంఘన తీవ్రతను బట్టి Dh200 నుంచి Dh10,000 వరకు జరిమానాలు విధించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇటీవల ప్రారంభమైన ఈ రైలు సేవ అబుదాబి-ఫుజైరా మధ్య నడుస్తుండగా, ప్రారంభానికి ముందే 10,000కు పైగా టికెట్లు విక్రయించబడ్డాయి. ప్రయాణికుల భద్రత, శుభ్రత మరియు క్రమశిక్షణను కాపాడేందుకు ఈ నియమాలను కఠినంగా అమలు చేయనున్నట్లు ఎతిహాద్ రైల్ వెల్లడించింది.

సాధారణ ఉల్లంఘనలలో చెత్తను సరైన విధంగా పారవేయకపోవడం, సీట్లపై కాళ్లు పెట్టడం, అనధికారిక సీట్లు ఆక్రమించడం, చెల్లుబాటు అయ్యే టికెట్ చూపించకపోవడం, టికెట్ మిస్‌యూజ్ వంటి వాటికి Dh200 జరిమానా విధించబడుతుంది. ప్రయాణ సమయంలో అనుచిత ప్రవర్తన, మత్తులో ప్రయాణించడం, మద్యం తీసుకెళ్లడం వంటి వాటికి కూడా ఇదే స్థాయి శిక్షలు వర్తిస్తాయి.

పొగ తాగడం, రైలు సేవలకు ఆటంకం కలిగించడం, సేవా ఆలస్యం చేయడం వంటి చర్యలకు Dh500 వరకు జరిమానా విధించనున్నారు.

అత్యంత తీవ్రమైన ఉల్లంఘనలుగా పరిగణించే ఘటనలకు భారీ శిక్షలు విధించబడతాయి. ఉదాహరణకు రైలు తలుపులను అడ్డుకోవడం, భద్రతా పరికరాలను తప్పుడు రీతిలో ఉపయోగించడం, వస్తువులను రైలు నుంచి విసరడం, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం, ట్రాక్‌లపై అక్రమంగా ప్రవేశించడం వంటి చర్యలకు Dh5,000 వరకు జరిమానా విధించనున్నారు.

అత్యవసర పరికరాలను అనవసరంగా వినియోగించడం, అత్యవసర నిష్క్రమణ మార్గాలను దుర్వినియోగం చేయడం, ప్రమాదకర పదార్థాలు తీసుకెళ్లడం వంటి చర్యలకు కూడా కఠిన శిక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. కొంతమంది కేసుల్లో ఉల్లంఘన తీవ్రతను బట్టి జరిమానా Dh10,000 వరకు పెరగవచ్చని వెల్లడించారు.

ప్రయాణికులు రైలు సేవల్లో క్రమశిక్షణ పాటించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎతిహాద్ రైల్ అధికారులు హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu