మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణపై చర్చ
హైదరాబాద్: గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆ దళం ప్రస్తుత కార్యాచరణ సామర్థ్యం, భవిష్యత్ సన్నద్ధతపై ఉన్నతస్థాయి సమీక్ష డిజిపి ఆనంద్ నిర్వహించారు.
మావోయిస్టు కార్యకలాపాలు దాదాపు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో గ్రేహౌండ్స్ దళం పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది తగ్గింపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
భవిష్యత్లో తలెత్తే భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కనీస స్థాయిలో ఎంతమంది సిబ్బంది అవసరమవుతారన్న దానిపై అధికారులు విశ్లేషణ జరిపారు.
ఈ సమావేశంలో అధునాతన శిక్షణ, సామర్థ్యాల పెంపు, ఆధునికీకరణ, మౌలిక వసతుల అభివృద్ధి, పరిపాలనా సహకారం, సిబ్బంది సంక్షేమ కార్యక్రమాలు వంటి అంశాలపై కూడా సమగ్ర చర్చ జరిగింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రత్యేక దళంగా గుర్తింపు పొందిన గ్రేహౌండ్స్ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
అలాగే రాబోయే ఐదేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించారు. దళాన్ని సాంకేతికంగా మరింత బలోపేతం చేసి, ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

