పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) లో నిరంతరం కొనసాగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు భారతదేశ ఇంధన భద్రతకు పెద్ద సవాలుగా మారాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పరిసరాల్లో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ దేశీయంగా చమురు సంక్షోభం తలెత్తే ముప్పు పొంచి ఉంది.
ఈ ఆందోళనలను అధిగమించడానికి, హర్మూజ్ జలసంధితో సంబంధం లేకుండా అరేబియా సముద్రగర్భం గుండా నేరుగా పైప్లైన్ నిర్మించే వ్యూహాత్మక మాస్టర్ ప్లాన్ను భారత్ వేగవంతం చేస్తోంది.
ఒమన్ టు గుజరాత్.. రూ. 40 వేల కోట్ల మెగా ప్రాజెక్ట్
ఈ సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయంగా 'సౌత్ ఆసియా గ్యాస్ ఎంటర్ప్రైజ్' (SAGE) ఆధ్వర్యంలో MEIDP (Middle East India Deepwater Pipeline) ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. సుమారు రూ. 40,000 కోట్ల ($4.7 to $4.8 Billion) అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా ఒమన్ నుండి నేరుగా భారతదేశంలోని గుజరాత్కు కనెక్టివిటీని ఏర్పాటు చేస్తారు. దాదాపు 2,000 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ సముద్రగర్భ పైప్లైన్ ద్వారా రోజుకు సుమారు 31 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ను రవాణా చేయవచ్చు. దీని ద్వారా యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్ వంటి ఆరు గల్ఫ్ దేశాల గ్యాస్ నిల్వలను నేరుగా భారత్కు అనుసంధానించవచ్చు.
సముద్రపు అగాధంలో ఇంజనీరింగ్ అద్భుతం
ఈ పైప్లైన్ రూట్ ప్రపంచంలోనే అత్యంత లోతైనదిగా రికార్డు సృష్టించనుంది. దీనిని సముద్ర మట్టానికి ఏకంగా 3,450 మీటర్ల లోతులో నిర్మించాల్సి ఉంటుంది. అంతటి అగాధంలో పైప్లైన్ వేయడం ఇంజనీరింగ్ పరంగా అతిపెద్ద సవాలు అయినప్పటికీ, SAGE సంస్థ ఇప్పటికే 3 కిలోమీటర్ల పొడవైన టెస్టింగ్ పైప్లైన్ను విజయవంతంగా పరీక్షించింది. ప్రస్తుతం దేశంలో గ్యాస్ డిమాండ్ రోజుకు సుమారు 190-195 mmscmd గా ఉండగా, అది 2030 నాటికి 300 mmscmd కి పెరగొచ్చని అంచనా. ఈ భారీ వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ.. గెయిల్ (GAIL), ఇంజనీర్స్ ఇండియా, ఐఓసీ (IOC) సంస్థలను ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

