హైదరాబాద్: టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు తన కెరీర్లో మరో ముఖ్యమైన ఘట్టాన్ని ఆరంభించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) క్రికెట్ ఆపరేషన్స్ విభాగాధిపతిగా ఆయన నియమితులయ్యారు.
మంగళవారం ఈ విషయాన్ని రాయుడు స్వయంగా ప్రకటించారు. వివాదాలు, పరిపాలనాపరమైన సవాళ్లతో సతమతమవుతున్న హెచ్సీఏలో రాయుడి వంటి అనుభవజ్ఞుడి రాక ప్రాధాన్యత సంతరించుకుంది.
సుప్రీంకోర్టు మానిటరింగ్ కమిటీ సభ్యుడు జస్టిస్ పి. నవీన్ రావు, హెచ్సీఏ కార్యదర్శి ఎం. జీవన్ రెడ్డి,అపెక్స్ కౌన్సిల్ ఈ నియామకాన్ని చేపట్టినట్లు రాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "హెచ్సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. అసోసియేషన్లో కొన్ని అంశాలను ప్రక్షాళన చేయడానికి, వ్యవస్థను మెరుగుపరచడానికి ఇది నాకు లభించిన గొప్ప అవకాశం" అని పేర్కొన్నారు.
హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అపారమైన క్రికెట్ ప్రతిభను గుర్తించడంపైనే తాను ప్రధానంగా దృష్టి సారిస్తానని రాయుడు స్పష్టం చేశారు. స్థానిక యువ క్రీడాకారులకు సరైన వేదిక కల్పించి, వారు భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దడమే తన అంతిమ లక్ష్యమని వివరించారు. శిక్షణ పద్ధతులు, సెలక్షన్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడం ద్వారా హైదరాబాద్ క్రికెట్ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాయుడు గతంలో హైదరాబాద్ రంజీ జట్టుకు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉంది. ఇక్కడి గ్రౌండ్స్, క్రీడాకారుల సామర్థ్యంపై ఆయనకు పూర్తి అవగాహన ఉండటం విశేషం. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ వంటి దిగ్గజ జట్ల తరపున ఆడిన అనుభవం హెచ్సీఏ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

