హైదరాబాద్కు తరలిస్తున్న ఈడీ...గత కొంతకాలంగా ఈడీ కళ్లుగప్పి తిరుగుతున్న హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్...
హైదరాబాద్: కొంతకాలంగా ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) కళ్లుగప్పి తిరుగుతున్న హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్ ను ఎట్టకేలకు అధికారులు అరెస్ట్ చేశారు.
హర్యానాలోని గుర్గావ్ లో తల దాచుకున్న ఆమెను టెక్నికల్ ఎవిడెన్స్ సహాయంతో ఈడీ అధికారులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. కాగా, అరెస్ట్ చేసిన ఆమెను శుక్రవారం గుర్గావ్ నుంచి హైదరాబాద్కు తరలించనున్నారు. గతంలోనే సుప్రీంకోర్టు ఆమెను వెంటనే సరెండర్ కావాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఆమె బెయిల్ ను రద్దు చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించింది.
ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం నౌహీరా షేక్ పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి నౌహీరా షేక్ గుర్గావ్ లో నకిలీ ఆధార్ కార్డ్, తప్పుడు వివరాలతో ఒక ఇంట్లో నివాసం ఉంటున్నట్లు ఈడీ విచారణలో తేలింది. తనపై జారీ అయిన నాన్-బెయిలబుల్ వారెంట్ పై స్టే ఇవ్వాలని కోరుతూ నౌహీరా షేక్ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే, అందుకు హైకోర్టు నిరాకరించడంతో ఆమెకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కొద్ది రోజుల్లోనే, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆమె గుర్గావ్లో ఉన్నట్లు ఈడీ పక్కాగా గుర్తించి అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

