కువైట్ సిటీ: ఇరాన్ దాడి నేపథ్యంలో కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అత్యవసర వైద్య స్పందన వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేసింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, 63 మంది గాయపడినట్లు ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది.
దాడి జరిగిన తొలి గంటల నుంచే దేశంలోని అన్ని ఆసుపత్రులు, వైద్య కేంద్రాలను హై అలర్ట్లో ఉంచినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించేందుకు వైద్యులు, నర్సులు, సాంకేతిక సిబ్బందిని అత్యవసరంగా మోహరించినట్లు పేర్కొంది.
అధికారుల వివరాల ప్రకారం, గాయపడిన 63 మందికి ఆసుపత్రులు మరియు వైద్య కేంద్రాల్లో చికిత్స అందించారు. తీవ్ర గాయాలైన బాధితుల కోసం ప్రత్యేక వైద్య బృందాలు ఏడు అత్యవసర శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆరోగ్య వ్యవస్థ 24 గంటలూ అప్రమత్తంగా పనిచేస్తోందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆసుపత్రులు, అత్యవసర విభాగాలు, అంబులెన్స్ సేవలు ప్రత్యేక సన్నద్ధత ప్రణాళికల ప్రకారం సేవలందిస్తున్నాయని తెలిపింది.
ప్రాంతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, సంబంధిత ప్రభుత్వ సంస్థలతో సమన్వయం కొనసాగిస్తున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రజారోగ్య పరిరక్షణ, అత్యవసర వైద్య సేవలను వేగంగా అందించడం తమ అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది.

