భారతదేశం, ఇటలీ మధ్య ఉన్న దౌత్య సంబంధాలు కేవలం అధికారిక అజెండాలకు మాత్రమే పరిమితం కాదని, అవి అంతకుమించిన భావోద్వేగ, చారిత్రక బంధాన్ని కలిగి ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఇటలీ రాజధాని రోమ్లో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనితో కలిసి ఆయన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇరుదేశాల మధ్య ఉన్న ప్రాచీన చరిత్ర, ఉమ్మడి భవిష్యత్తు, మరియు స్నేహపూర్వక సంబంధాలపై విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, ఇటలీ మధ్య అత్యంత సన్నిహిత సహకారం, సమన్వయం ఉన్నాయని.. ఈ పర్యటన ద్వారా రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం' (Special Strategic Partnership) స్థాయికి పెంచినట్లు వివరించారు.
ఈ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా రెండు దేశాలు 2025-2029 జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ పురోగతిని సమీక్షించాయి. వ్యాపారం, పెట్టుబడులు, రక్షణ, అంతరిక్ష పరిశోధనలు, క్లీన్ ఎనర్జీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి కీలక రంగాలలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు. పరస్పర వాణిజ్యాన్ని రాబోయే 2029 నాటికి 20 బిలియన్ యూరోలకు చేర్చడమే లక్ష్యంగా ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయి. ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో "మెలోడి" (#Melodi) హ్యాష్ట్యాగ్తో ఇరుదేశాల ప్రధానుల స్నేహపూర్వక ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. రోమ్లోని చారిత్రాత్మక కొలోసియం సందర్శనతో పాటు, ప్రధాని మోదీ మెలోనికి 'మెలోడీ' చాక్లెట్లను గిఫ్ట్గా ఇవ్వడం విశేషం. ఈ అపూర్వ స్నేహం ఇరు దేశాల ప్రజల మధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

