త్రివేండ్రం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (UDF) భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ కేరళ ఓటర్లు మార్పు కోరుతూ స్పష్టమైన తీర్పునిచ్చారని హర్షం వ్యక్తం చేశారు. పాలక పక్షమైన ఎల్డీఎఫ్ (LDF) దుష్పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారని థరూర్ పేర్కొన్నారు. కొందరు మంత్రులకు వ్యక్తిగత ఇమేజ్ ఉన్నప్పటికీ, ఓటర్లు ప్రభుత్వం మారాలని నిర్ణయించుకున్నారని ఆయన విశ్లేషించారు.
కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు థరూర్ నేరుగా పేరు చెప్పకుండా.. ప్రస్తుతం తమ దృష్టంతా చారిత్రక విజయంపైనే ఉందని వ్యాఖ్యానించారు. 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం శుభపరిణామమని, కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అన్నారు.తాజా ట్రెండ్స్ ప్రకారం యూడీఎఫ్ 90కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎల్డీఎఫ్ 50 లోపు స్థానాలకు పరిమితమైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సుమారు 5 స్థానాల్లో గట్టి పోటీనిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత పీజే కురియన్ గతంలో చేసిన వ్యాఖ్యల ప్రకారం.. సీఎం పదవి కోసం ముగ్గురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

