కువైట్: కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు డ్రోన్లను శుక్రవారం ఉదయం కువైట్ సాయుధ దళాలు విజయవంతంగా అడ్డుకుని కూల్చివేశాయి. ఈ విషయాన్ని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.
కువైట్ న్యూస్ ఏజెన్సీ (KUNA) ప్రచురించిన ప్రకటనలో రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ స్టాఫ్ సౌద్ అల్-అత్వాన్ మాట్లాడుతూ, ఇరాన్ కొనసాగిస్తున్న దాడుల్లో భాగంగా దేశంలోని పలు కీలక మౌలిక వసతులు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు ప్రయోగించారని తెలిపారు.
అయితే అప్రమత్తంగా ఉన్న కువైట్ సాయుధ దళాలు వెంటనే స్పందించి శత్రు డ్రోన్లను గుర్తించి, వాటిని గగనతలంలోనే ధ్వంసం చేశాయని ఆయన చెప్పారు.
డ్రోన్ల శకలాలు నేలపై పడటంతో కొంత ఆస్తి నష్టం జరిగినప్పటికీ, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని కల్నల్ సౌద్ అల్-అత్వాన్ వెల్లడించారు.
దేశ భద్రతను కాపాడేందుకు కువైట్ సాయుధ దళాలు అత్యున్నత స్థాయి అప్రమత్తతతో పనిచేస్తున్నాయని, గగనతల రక్షణ వ్యవస్థలు అన్ని రకాల ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

