కువైట్ సిటీ: కువైట్ సెంట్రల్ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు పరారవడంతో దేశవ్యాప్తంగా భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. ఖైదీలను పట్టుకునేందుకు అధికారులు విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు జైలు భద్రతలో జరిగిన లోపాలపై తక్షణ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటనపై కువైట్ తొలి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసుఫ్ అల్ సబాహ్ అత్యవసర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఖైదీలు ఎలా తప్పించుకున్నారో, భద్రతా వైఫల్యాలకు ఎవరు బాధ్యులో గుర్తించాలని సూచించారు.
సోమవారం విడుదల చేసిన ప్రకటనలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, దేశంలోని సరిహద్దు చెక్పోస్టులు మరియు ప్రవేశ ద్వారాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. పరారైన ఖైదీలను వీలైనంత త్వరగా గుర్తించి అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు వెల్లడించింది.
పరారైన ఖైదీలను అలీ మనాహీ అల్ సుబాయి, అహ్మద్ మహ్మద్ ఖతియా, హసన్ సాలెం అల్ రషీదిగా గుర్తించారు. వారి వివరాలను భద్రతా సంస్థలు దేశవ్యాప్తంగా పంపిణీ చేసి, వారిని గుర్తించడంలో ప్రజలు సహకరించాలని కోరాయి.
పరారైన ఖైదీలకు ఆశ్రయం కల్పించడం, వారిని తప్పించేందుకు సహాయం చేయడం లేదా వారి ఆచూకీ గురించి సమాచారం దాచిపెట్టడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
ఖైదీలకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే అత్యవసర హెల్ప్లైన్ 112కు సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరారు.

