మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'మెగా 158' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ చిత్రాన్ని నేడు (మే 21) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.
పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిరు, పవన్ కలిసి ఒకే కారులో రావడం.. మెగా బ్రదర్స్ ముగ్గురూ ఒకే సోఫాలో పక్కపక్కనే కూర్చోవడం అందరినీ ఆకర్షించింది.
పవన్ కళ్యాణ్ కొబ్బరికాయ కొట్టి 'మెగా 158' సినిమాని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవిపై క్లాప్ కొట్టి చిత్ర బృందానికి పవన్ తన బెస్ట్ విషెష్ అందజేశారు. చిరు కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల, వీవీ వినాయక్ కెమెరా స్విఛ్ ఆన్ చేశారు. సీనియర్ దర్శకులు ఏ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, నాగబాబు కలిసి స్క్రిప్టుని దర్శకుడు బాబీకి అందించారు. అల్లు అరవింద్, దిల్ రాజు, కేఎస్ రామారావు, మెహర్ రమేష్, వశిష్ఠ, బండ్ల గణేష్, నిహారిక కొణిదెల తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

