మనామా: వేసవిలో కార్మికులను తీవ్ర ఎండ నుంచి రక్షించేందుకు అమలు చేస్తున్న మిడ్ డే వర్క్ నిషేధాన్ని బహ్రెయిన్ కార్మిక, న్యాయ వ్యవహారాల మంత్రి యూసిఫ్ బిన్ అబ్దుల్ హుస్సైన్ ఖలఫ్ ప్రత్యక్షంగా పరిశీలించారు.
పలు నిర్మాణ ప్రాంతాలను సందర్శించిన మంత్రి, అక్కడ అమలవుతున్న భద్రతా చర్యలను పరిశీలించి కార్మికుల సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ 15 నుంచి ఆగస్టు 31 వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో, నేరుగా ఎండలో పనులు చేయడాన్ని నిషేధించారు. ఈ నిబంధనల అమలును మంత్రి స్వయంగా తనిఖీ చేశారు.
నిర్మాణ ప్రాంతాల్లో భద్రతా పర్యవేక్షకులతో సమావేశమైన మంత్రి, కార్మికులకు సురక్షితమైన పని వాతావరణం కల్పించడంతో పాటు ఎండ తీవ్రత వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించేందుకు అన్ని సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వేసవి మధ్యాహ్న పని నిషేధాన్ని కంపెనీలు సమర్థంగా పాటిస్తున్నాయని మంత్రి ప్రశంసించారు. కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ విషయంలో యజమానులు తమ బాధ్యతను గుర్తించి వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇది బహ్రెయిన్లో వృత్తిపరమైన భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడంలో కీలకమని పేర్కొన్నారు.
కార్మిక శాఖ తనిఖీ బృందాలు ప్రతిరోజూ నిషేధిత సమయాల్లో నిర్మాణ ప్రాంతాలను సందర్శించి నిబంధనల అమలును పర్యవేక్షిస్తున్నాయి. కార్మికులకు తాగునీరు, తగిన విశ్రాంతి విరామాలు, ఎండ తీవ్రత నుంచి రక్షణ కల్పించే చర్యలు అమలులో ఉన్నాయా లేదా అనే విషయాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత న్యాయ అధికారులకు కేసులు పంపిస్తామని కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

