యూఏఈః ఎమిరేటీ జాతీయ దుస్తులైన కందూరాలను ధరించడాన్ని కేవలం యూఏఈ పౌరులకు మాత్రమే పరిమితం చేసే ఇటీవలి విధానం వెనుక ఉన్న కారణాన్ని యూఏఈ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
సోషల్ మీడియా కంటెంట్ మరియు ప్రకటనలలో ఎమిరేటీయేతరులు ఈ సాంప్రదాయ దుస్తులను దుర్వినియోగం చేయడంపై పెరుగుతున్న ప్రజా అసంతృప్తికి ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్టు నేషనల్ మీడియా అథారిటీ సెక్రటరీ-జనరల్ అయిన డాక్టర్ జమాల్ మహమ్మద్ అల్ కాబీ తెలిపారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ప్రకటనలలో, ఎమిరేటీ దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు విరిగిన, ఎమిరేటీయేతర మాండలికాలను ఉపయోగించి ఇచ్చే ప్రకటనల పట్ల నిరసనలు వ్యక్తం అయినట్లు గుర్తుచేశారు. నాన్ ఎమిరేటీలు.. ఎమిరేటీ దుస్తులు ధరించి ప్రజల మనోభావాలను దెబ్బతీయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన వ్యక్తులు స్థానిక విలువలకు విరుద్ధంగా ప్రవర్తించే ప్రకటనలపై కూడా కఠినంగా ఉంటామని హెచ్చరించారు.
గత సంవత్సరం ఏప్రిల్లో జరిగిన ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) సమావేశంలో ఈ విధానం ప్రారంభమైంది. ఎమిరేటీ సమాజానికి సరైన గుర్తింపును తెలియజేయడానికి, ఎమిరేటీలు అయి, జాతీయ దుస్తులు ధరించిన వారు తప్ప మరెవరూ ఎమిరేటీ మాండలికంలో ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడకూడదని ఒక కొత్త విధానం ప్రవేశపెట్టారు. ఈ నియంత్రణ ఉద్దేశ్యం మాండలికం లేదా వస్త్రధారణ వాడకాన్ని పరిమితం చేయడం కాదని, తమ సాంస్కృతిక హోదాను కాపాడే ప్రమాణాల పరిధిలో దేశానికి సజీవ ప్రతిరూపం అని ఆయన పేర్కొన్నారు. ప్రకటనలలో ఎమిరేటీ జాతీయ వస్త్రధారణను ధరించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎమిరేటీ పౌరులై ఉండాలని కొత్త నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.

