Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పదేళ్లలో 100 కొత్త ఎయిర్‌పోర్టులు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

పదేళ్లలో 100 కొత్త ఎయిర్‌పోర్టులు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

maa gulf 3 days ago

న్యూ ఢిల్లీ: దేశంలో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలను సిద్ధం చేసింది. రాబోయే పదేళ్లలో దేశవ్యాప్తంగా వంద కొత్త ఎయిర్‌పోర్టులు, 200 హెలిప్యాడ్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

బుధవారం మొదటిసారిగా జార్ఖండ్ రాజధాని రాంచీకి వచ్చిన కేంద్రమంత్రి, స్థానిక ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల కోసం పలు సరికొత్త సౌకర్యాలను ప్రారంభించారు.

ప్రయాణికుల కోసం 'ఫ్లైబ్రరీ'.. త్వరలో ఉడాన్-2
రాంచీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల కోసం 'ఉడాన్ యాత్రీ కేఫ్‌'తో పాటు 'ఫ్లైబ్రరీ' (Flybrary) అనే వినూత్న గ్రంథాలయాన్ని మంత్రి ప్రారంభించారు. విమానాల కోసం వేచి చూసే ప్రయాణికులు ఇక్కడ పుస్తకాలు చదువుకోవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ తీసుకున్న పుస్తకాన్ని చదివి, ప్రయాణం ముగిశాక దేశంలోని మరో ఎయిర్‌పోర్టులో వెనక్కి ఇచ్చేయవచ్చు. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ ఈ కేఫ్‌లను విస్తరిస్తామన్నారు. అలాగే రూ. 29 కోట్లతో సవరించిన ప్రాంతీయ అనుసంధాన పథకం 'ఉడాన్-2' త్వరలోనే ప్రారంభం కానుందని స్పష్టం చేశారు.

ఇంటర్నేషనల్ సంక్షోభం..విమానయాన రంగానికి కేంద్రం సపోర్ట్
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) లో రాజకీయ ఉద్రిక్తతలు మరియు సంక్షోభం పెరుగుతున్న నేపథ్యంలో, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని కేంద్రమంత్రి సూచించారు. అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం దేశీయంగా పడకుండా ఉండేందుకు కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంటోందన్నారు. విమానయాన రంగానికి అండగా నిలిచేందుకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలను తగ్గించడంతో పాటు ఎయిర్‌పోర్టుల్లో ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu