మక్కా: రాబోయే వార్షిక హజ్ యాత్రను పురస్కరించుకొని పవిత్ర స్థలాల్లోని సౌకర్యాల సంసిద్ధతను అంచనా వేయడానికి మక్కా డిప్యూటీ ఎమిర్ మరియు హజ్, ఉమ్రా శాశ్వత కమిటీ ఉపాధ్యక్షులు ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఈ పర్యటనలో డిప్యూటీ ఎమిర్తో పాటు హజ్ మరియు ఉమ్రా ఉప మంత్రి డాక్టర్ అబ్దుల్ ఫత్తా మషత్, మక్కా మేయర్ ముసైద్ అల్-దావూద్, ప్రజా భద్రతా డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అల్-బస్సామి మరియు పలు ఏజెన్సీలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఈ క్షేత్ర పర్యటన మక్కా-జెడ్డా ఎక్స్ప్రెస్వేపై ఉన్న షుమైసి తనిఖీ కేంద్రం (చెక్ పాయింట్) సందర్శనతో ప్రారంభమైంది. అత్యాధునిక స్మార్ట్ సాంకేతికతలతో కూడిన 16 లేన్లను కలిగి ఉన్న ఈ తనిఖీ కేంద్రం గురించి ప్రిన్స్ సౌద్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో హైవే పెట్రోలింగ్ కార్యాలయాలు, 10 ప్రభుత్వ ఏజెన్సీల కోసం ప్రత్యేకించిన ఒక భవనం మరియు సిబ్బంది నివాస సముదాయాలు కూడా ఉన్నాయి.
అనంతరం డిప్యూటీ ఎమిర్ మీనా ఎమర్జెన్సీ హాస్పిటల్ 2ను సందర్శించారు. ఈ ఆసుపత్రి 5,300 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ఆసుపత్రిలో 200 పడకల సామర్థ్యం ఉంది. వివిధ ఆరోగ్య మరియు భద్రతా ఏజెన్సీల సహకారంతో ఏర్పాటు చేయబడిన క్షేత్ర స్థాయి ఆసుపత్రుల (field hospitals) గురించి ప్రిన్స్ సౌద్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. హజ్ యాత్ర సమయంలో 900కు పైగా అంబులెన్సులు, 11 వైద్య తరలింపు విమానాలు మరియు 71 క్షేత్రస్థాయి అత్యవసర కేంద్రాల ద్వారా వైద్య పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు వివరించారు.
ఆ తర్వాత పవిత్ర స్థలాలలో నీటి పంపిణీకి సంబంధించిన కార్యాచరణ ప్రక్రియలను నిర్వహించే పవిత్ర స్థలాల పర్యవేక్షణ మరియు నియంత్రణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రంలో 4,000కు పైగా సెన్సార్లు మరియు పర్యవేక్షణ పరికరాలు ఉన్నాయి. చివరగా ముజ్దలిఫాలోని ఎమిరేట్ కార్యాలయంలో హజ్ మరియు ఉమ్రా శాశ్వత కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ ఏజెన్సీల కార్యాచరణ ప్రణాళికల సమీక్ష, యాత్రికులకు సంబంధించిన సేవలు, పుణ్యక్షేత్రాల వద్ద సౌకర్యాలు మరియు సేవల సంసిద్ధతపై చర్చించారు.

