యూఏఈః ఉప ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్.. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ అయిన రాఫెల్ గ్రోస్సీతో ఫోన్లో మాట్లాడారు.
ఈ సందర్భంగా డ్రోన్ దాడిలో అల్ ధఫ్రా ప్రాంతంలోని బరాకా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో ఉన్న విద్యుత్ జనరేటర్లో మంటలు చెలరేగడాన్ని ఆయన 'పిరికిపంద ఉగ్రవాద దాడి'గా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించారు.
పౌర సౌకర్యాలు మరియు కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని షేక్ అబ్దుల్లా చెప్పారు. ఇటువంటి ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందించడానికి, అలాగే అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా తమ భద్రత, ప్రాదేశిక సమగ్రత మరియు పౌరులను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి యూఏఈకి పూర్తి హక్కు ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, రేడియేషన్ భద్రతా స్థాయిలపై ఎలాంటి ప్రభావం పడలేదని స్పష్టంచేశారు.
భద్రత, రక్షణ మరియు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి సంబంధించిన అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించుకోవడానికి తమ మద్దతు కొనసాగుతుందన్నారు. వివిధ రంగాలలో దానిని పెంపొందించే మార్గాల గురించి కూడా ఇరుపక్షాలు చర్చించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో అణు భద్రతను బలోపేతం చేయడంలో ఐఏఈఏ పోషిస్తున్న కీలక పాత్రకు మద్దతు ఇవ్వడానికి యూఏఈ కట్టుబడి ఉందని షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ స్పష్టం చేశారు.

