Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

maa gulf 1 week ago

తిరువనంతపురం సెంట్రల్ నుండి ఢిల్లీ లోని హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న ప్రతిష్టాత్మక రాజధాని ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 12431) లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

శుక్రవారం సాయంత్రం బయలుదేరిన ఈ రైలు, శనివారం మధ్యాహ్నానికి దిల్లీ చేరుకోవాల్సి ఉండగా.. మార్గమధ్యలో రాజస్థాన్‌లోని కోటా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో రైలులోని బీ1 (B1) ఏసీ కోచ్‌తో పాటు ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, రైల్వే సిబ్బంది, ప్రయాణికులు సమయస్ఫూర్తితో వ్యవహరించడం, మంటలను ముందుగానే గుర్తించడంతో ఒక భారీ ప్రాణనష్టం మరియు ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది.

అప్రమత్తం చేసిన ఆటోమేటెడ్ హూటర్..15 నిమిషాల్లో ఖాళీ!

ఈ ప్రమాదం జరిగిన సమయంలో సదరు కోచ్‌లో 68 మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. అయితే, కోటా స్టేషన్‌లో అమర్చిన అత్యాధునిక 'ఆటోమేటెడ్ హూటర్' (Automated Hooter) సిస్టమ్ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి మోగడంతో రైల్వే యంత్రాంగం తక్షణమే అప్రమత్తమైంది. రైలును వెంటనే నిలిపివేసి, కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే ప్రభావిత బోగీలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ (OHE) విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా ప్రమాదానికి గురైన కోచ్‌ను రైలు నుండి వేరు చేశారు. ముందుజాగ్రత్తగా పక్కనే ఉన్న మిగతా బోగీలను కూడా ఖాళీ చేయించారు.

రంగంలోకి ఉన్నతాధికారులు.. వరుస ఘటనలపై ప్రయాణికుల ఆందోళన!

ప్రమాద సమాచారం అందిన వెంటనే కోటా డివిజినల్ రైల్వే మేనేజర్ (DRM) అనిల్ కల్రా సహా సీనియర్ రైల్వే అధికారులు, రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, గత మూడు రోజుల వ్యవధిలోనే రైల్వేలో ఇది రెండో అగ్నిప్రమాదం కావడం గమనార్హం. మే 15న హైదరాబాద్‌లోని నాంపల్లి స్టేషన్‌లో జైపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీల్లో మంటలు చెలరేగిన ఘటన మరవకముందే, ఇప్పుడు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఇలా జరగడం ప్రయాణికుల్లో రైల్వే భద్రతపై కొంత ఆందోళన రేకెత్తిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu